రాహుల్ గాంధీ మాదిరి చంద్రబాబును ఇబ్బంది పెడుతున్నారు: చింతా మోహన్

  • కోర్టుల్లో రాజకీయ జోక్యం ఎక్కువగా కనిపిస్తోందన్న చింతా మోహన్
  • 38 రోజులుగా చంద్రబాబును జైల్లో ఉంచడం దారుణమని వ్యాఖ్య
  • కాంగ్రెస్ తో పొత్తుకు టీడీపీ, జనసేనలను ఆహ్వానిస్తున్నామన్న మోహన్
కోర్టుల్లో రాజకీయ జోక్యం ఎక్కువగా కనిపిస్తోందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసులు నమోదు చేయడం దారుణమని అన్నారు. చంద్రబాబు వ్యక్తిగతంగా తనకు బాగా తెలుసని... ఆయన చాలా మంచి వ్యక్తి అని కితాబిచ్చారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

చంద్రబాబు తప్పు చేసినట్టు రుజువులు లేవని... కేవలం ఆరోపణలతోనే ఆయనను జైల్లో పెట్టడం దారుణమని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాదిరి చంద్రబాబును ఇబ్బంది పెడుతున్నారని దుయ్యబట్టారు. 

38 రోజులుగా చంద్రబాబును జైల్లో ఉంచడం పెద్ద తప్పు అని చింతా మోహన్ అన్నారు. తమిళనాడు తరహా రాజకీయాలను ఏపీలోకి తీసుకొచ్చారని విమర్శించారు. ఏపీలో కాంగ్రెస్ తో పొత్తుకు టీడీపీ, జనసేనలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు 10 నుంచి 15 శాతం వరకు పెరిగిందని అన్నారు. తమ పార్టీతో కలిసిన వారు తప్పకుండా అధికారంలోకి వస్తారని చెప్పారు.

Chinta Mohan
Congress
Chandrababu
Telugudesam

More Telugu News